Monday, December 20, 2010

భీష్మించిన బాబు

నిమ్స్‌లోనే దీక్ష కొనసాగింపు... నాటకీయ ఫక్కీలో అరెస్ట్, ఆస్పత్రికి తరలింపు... చికిత్సకు సహకరించని బాబు... పరిస్థితి తీవ్రమే: వైద్యులు... 309 సెక్షన్ కింద కేసు .... పోలీసులు, కార్యకర్తల మధ్య ఘర్షణ.....
హైదరాబాద్, డిసెంబర్ 20: నాటకీయ పరిణామాల మధ్య సోమవారం తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రైతులకు న్యాయం చేయాలంటూ గత నాలుగు రోజుల నుంచి నూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిరవధిక నిరాహార దీక్ష జరుపుతున్న చంద్రబాబునాయుడును సోమవారం తెల్లవారు జామున పోలీసులు అదుపులోకి తీసుకుని నిమ్స్‌కు తరలించారు. నిమ్స్‌లో దీక్ష కొనసాగుతున్నట్టు బాబు ప్రకటించారు. వైద్య చికిత్సకు ఆయన సహకరించడం లేదు. బాబు ఆరోగ్యంపై పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉన్నా బిపి, షుగర్ హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్టు డాక్టర్లు తెలిపారు. చికిత్సకు సహకరించాలని కోరారు. తన దీక్ష కొనసాగుతుందని తనను కలిసిన పార్టీ నాయకులతో బాబు తెలిపారు. ఇలా ఉండగా ఆదివారం రాత్రి నుంచే దీక్షా భగ్నానికి పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పార్టీ కార్యకర్తలు దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టడంతో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. టిడిపి నాయకులు తర్జనభర్జనలు పడుతుండగా, అర్ధరాత్రి వెనక్కి వెళ్లిన పోలీసులు తెల్లవారు జామున నాలుగున్నర ప్రాంతంలో వెనక గేటు నుంచి పెద్ద సంఖ్యలో శిబిరం వద్దకు ప్రవేశించారు. కొంత మంది నాయకులు, కార్యకర్తలు ప్రతిఘటించినప్పటికీ పోలీసులు చాక చక్యంగా వ్యవహరించి టిడిపి అధినేతను ప్రత్యేక అంబులెన్స్‌లోకి చేర్చి నిమ్స్‌కు తరలించారు. ఈ సందర్భంగా బాబు పోలీసులతో కొద్దిసేపు పెనుగులాడారు. తన ఆరోగ్యం బాగానే ఉందంటూ ఆస్పత్రికి రావడానికి నిరాకరించారు. దాంతో పోలీసులు బలవంతంగా ఆయన్ని ఎత్తుకెళ్లి స్ట్రేచర్‌పైకి చేర్చారు. ఈ దశలో జరిగిన పెనుగులాటలో బాబు స్ట్రెచర్ పైన కాకుండా కింద కూలబడ్డారు. పోలీసులు బాబును స్ట్రెచర్‌పై పడుకోబెట్టి బలవంతంగా ప్రత్యేక అంబులెన్స్‌లో నిమ్స్‌కు తరలించారు. ఇదే సమయంలో బాబు కుమారుడు లోకేశ్, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సైతం తోపులాటలో కింద పడ్డారు. వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దశలో కొందరు కార్యకర్తలు పోలీసులపైకి కుర్చీలు విసిరారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ జరిపారు. ఆత్మహత్యాయత్నం నేరం కింద చంద్రబాబుపై 309 సెక్షన్ కింద, మిగిలిన కార్యకర్తలు, నాయకులపై 353 సెక్షన్ కింద సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. అయితే టిడిపి నాయకులు మాత్రం చంద్రబాబును అమానుషంగా లాక్కెల్లారని, ఎమ్మెల్యేలపై లాఠీచార్జీ చేశారని ఆరోపించారు.
చంద్రబాబు దీక్షను భగ్నం చేసినప్పటికీ రైతుల సంక్షేమం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని టిడిపి మిత్రపక్షాల నాయకులు నిర్ణయించారు. ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన టిడిపి మిత్రపక్షాల సమావేశంలో సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు, వివిధ రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. సోమవారం మండల కార్యాలయాల్లో కార్యకలాపాలను స్థంబింపజేయాలని నిర్ణయించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లను ముట్టడించాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వంలో మార్పు రాకపోతే గురువారం రాష్ట్రంలో అన్ని రహదారులను దిగ్బంధించాలని నిర్ణయించినట్టు దేవేందర్‌గౌడ్, నామా నాగేశ్వరరావు, సిపిఐ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఈనెల 23న లక్షలాదిగా జనం రోడ్లపైకి వచ్చి రహదారులను దిగ్బంధం చేయాలని, పాలనను స్థంబింపజేయాలని పిలుపును ఇచ్చారు. రైతుల సంక్షేమం కోసం తాము డిమాండ్లకు మద్దతు ఇస్తున్నాం కానీ ఆందోళనలో పాల్గొనడం లేదని లోక్‌సత్తా తెలిపింది. సోమవారం జరిగిన బంద్‌ను లోక్‌సత్తా వ్యతిరేకించింది అయితే మిత్రపక్షాల సమావేశంలో పాల్గొని డిమాండ్లకు మద్దతు తెలిపింది.
ఆస్పత్రి వద్ద హంగామా....
నిమ్స్ ఆస్పత్రిలో ఉన్న చంద్రబాబును చూసేందుకు వివిధ జిల్లాల నుంచి టిడిపి శ్రేణులు పెద్ద సంఖ్యలో నిమ్స్‌కు తరలి వచ్చారు. నిజామాబాద్ జిల్లా నుంచి టిడిపి ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వరరావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంప గోవర్దన్‌లు పార్టీ శ్రేణులతో కలిసి నిమ్స్‌కు వచ్చారు. పోలీసులు వీరిని లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకుని అరెస్టు చేశారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నిమ్స్ ముందు గుమికూడడంతో రోగులు లోనికి బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వం దీక్షను భగ్నం చేయడానికి ముందు కనీసం ఒక మంత్రిని ప్రతినిధిగా పంపి డిమాండ్లపై చర్చలు సాగించాల్సిందని టిడిపి నాయకులు ఎర్రంనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు సూచించారు. నిమ్స్‌లో ఉన్న చంద్రబాబును పలువురు నాయకులు పరామర్శించారు. అజిత్‌సింగ్, బిజెపికి, జెడియుకు చెందిన బీహార్ నాయకులు నిమ్స్‌కు వచ్చి బాబును కలిశారు. ఎజిపి నాయకుడు జోసెఫ్, ఆర్‌ఎస్‌పి ఎంపీ అబానీరాయ్, మంద కృష్ణ మాదిగ నిమ్స్ ఆస్పత్రిలో చంద్రబాబును పరామర్శించారు. పాంథర్స్‌పార్టీ నాయకులు భీమ్‌సింగ్ , బిజెపి ఎంపి కల్‌రాజ్ మిశ్రా ఇతర పార్టీల నాయకులు నిమ్స్‌కు వచ్చారు.
చికిత్సకు ససేమిరా...
నిమ్స్ డాక్టర్లు అందిస్తున వైద్య సేవలను చంద్రబాబు తిరస్కరిస్తున్నారు. రైతులకు సరైన న్యాయం చేసే వరకు దీక్ష విరమించేది లేదని చంద్రబాబు నిమ్స్ డాక్టర్లకు తేల్చి చెప్పారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆయన వైద్యం చేయించుకునేందుకు సహకరించడం లేదని నిమ్స్ డైరెక్టర్ పివి రమేష్ వెల్లండించారు. ఆయన వెంటనే ఫ్లూయిడ్స్ తీసుకుని, అవసరమైన మందులు వేసుకోవాలని లేదంటే పరిస్థితి విషమంగా మారే అవకాశం ఉందని ఆయన మీడియాతో చెప్పారు. డాక్టర్ శ్రీనివాస్ జనరల్ మెడిసిన్, డాక్టర్ వై. సత్యనారాయణ, కార్డియాలజిస్ట్ డాక్టర్ శేషగిరి రావు, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కెవి దక్షిణామూర్తి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అజిత్ కుమార్‌ల బృందం పర్యవేక్షిస్తోందని అన్నారు.

No comments:

Post a Comment