Friday, December 10, 2010

సోనియాగాంధీ కంటే.. నేనే బెటర్‌ !

tdp
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్సార్‌ కడవరకూ జపించిన ‘విశ్వసనీయత’ మంత్రం తాజాగా.. 
చంద్రబాబు నోట వినిపిస్తోంది.విశ్వసనీయత అంశంపై ఆయన విలేకరు లకు చిన్నపాటి క్లాసునే తీసుకున్నారు.విశ్వసనీయతనుఆధారంగా చేసుకుంటే జాతీయ స్థాయిలో సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ల కంటే తానే ముందు వరుసలో ఉంటానని చెప్పు కొచ్చారు. ‘తెలుగుదేశానికి విశ్వసనీయతే అసలు సమస్య’ అంటూ ఓ దినపత్రికలో వచ్చిన కథనానికి ఆయన స్పందించారు.శాసనసభలో తన ఛాంబర్‌లో ఆయన తనను కలిసిన విలేకరులతో కొద్దిసేపు ము చ్చటించారు. తొమ్మిదేళ్లు సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడిపాను. పరిపాలనలో గానీ, జవాబుదారీతనంలోగానీ, అధికార యంత్రాంగం లో గానీ ఎక్కడైనా తప్పు జరిగిందా? నా హయాంలో కుంభకోణాలు జరిగాయా? నాకంటే విశ్వసనీయత ఎవరికి ఉంది..’ అని అన్నారు.

‘తమిళనాడులో కరుణానిధి, కాశ్మీర్‌లో ఫరూఖ్‌..ఇక్కడ నేను మా కంటే విశ్వసనీయత ఇంకెవరికుంది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ములాయం సింగ్‌, దేవేగౌడ, జయలలిత పరిస్థితి ఏమైంది. చివరికి సోనియాగాంధీ కూడా చతికలి పడింది. 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణంలో తన పేరు ఎక్కడ బయటికి వస్తుందోనని సోనియా భయపడుతోంది. కామన్వెల్త్‌ క్రీడల్లో కుంభకోణంలో రూ. కోట్ల మేర అవినీతి జరిగింది. నా హయాంలో ఎప్పుడైనా కుంభకోణాలు జరిగాయా? ఏషియన్‌ గేమ్స్‌లను సమర్థవంతంగా నిర్వహించలేదా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.

‘రాహుల్‌గాంధీ గురించి గొప్పగా రాశారు. ఆయన వల్ల కాంగ్రెస్‌పార్టీకి తిరుగు ఉండదని కథనాలు రాశారు. ఏమైంది? కాంగ్రెస్‌పార్టీ బీహార్‌లో నాలుగు స్థానాలకు పరిమితమైంది. వెంటనే ఆయనను చెత్తబుట్టలో వేశారు..’ అని చెప్పారు.వైఎస్‌ కోట్ల రూపాయలు కుమ్మరించారని, అయినా కేవలం ఒక శాతం ఓట్ల ఆధిక్యంతో మాత్రమే అధికారాన్ని సాధించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. డబ్బులు ఖర్చు చేసి కొనే విశ్వసనీయత అవసరం లేదని తాను ఇదే గదిలో వైఎస్‌కు చెప్పానని అన్నారు.‘అదేమి పరిస్థితో గానీ, కమ్యూనిస్టులు కూడా మాకు ఓట్లు వేయలేదు. పైగా టిఆర్‌ఎస్‌ ఒకటి మాకు జతకట్టింది..’ అని కాస్త అసహనంతో అన్నారు. వైఎస్‌ అమలు చేసిన పథకాలను చూసే ప్రజలు ఓట్లు వేసి ఉంటే మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఎందుకు ఓడిపోయేది? అని చెప్పారు. ప్రత్యేక కథనాలు రాసే సమయంలో జాగ్రత్తగా విశ్లేషణలు జరపాలని చంద్రబాబు ముక్తాయింపునిచ్చారు.

No comments:

Post a Comment