Monday, December 20, 2010

నేను రైతు బిడ్డను * నేను అనని మాటలను అంటగట్టారు.. * అన్నదాతకు దూరం చేసే యత్నమిది

నా తల్లిదండ్రులు నేల తల్లిని నమ్ముకున్నారు..
వారి రుణం తీర్చుకునేందుకే ఈ పోరాటం
న్యాయం జరిగేదాకా వెనక్కి తగ్గేది లేదు..
అంకెల గారడీతో దగా చేస్తున్న ప్రభుత్వం
రుణాల రీషెడ్యూల్‌పై మాయమాటలు..
2007 నాటి ఇన్‌పుట్ సబ్సిడీ ఇప్పుడిచ్చారు
పనలపై తడిసిన ధాన్యానికి బీమా వర్తిస్తుందా?..
రాయితీ కోరితే రాజకీయం చేసినట్లా?
సర్కారుపై చంద్రబాబు ధ్వజం.. రైతులకు బహిరంగ లేఖ
" నేను అనని మాటలను నాకు అంటగట్టారు. నన్ను రైతుల నుంచి దూరం చేసే దుర్మార్గం చేశారు. నా తల్లిదండ్రులు ఆఖరి శ్వాస వదిలే వరకు నేల తల్లిని నమ్ముకున్నారు. అన్నదాతల ఆక్రోశం కలచి వేస్తోంది. ఒక రైతు బిడ్డగా వారి రుణం తీర్చుకునేందుకే నా పోరాటం. అందుకే గాంధీజీ చూపిన బాటలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాను '' అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు.

రైతుల సమస్యల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివారం రైతులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. శనివారం సీఎం కిరణ్‌కుమార్ రాసిన లేఖలోని పలు అంశాలను ప్రస్తావిస్తూ 'ఇవీ అసలు వాస్తవాలు' అని అంకెలతో సహా వివరించారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కే వరకు, బాధితులకు సరైన పరిహారం లభించే వరకు తన పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. మనో స్థైర్యం కోల్పోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇదీ బాబు లేఖ సారాంశం...

"ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రుల వర్కింగ్ గ్రూపు ప్రధానికి సమర్పించిన నివేదికలో ఎకరాకు రూ. 10 వేలు పరిహారం చెల్లించాలని, పెట్టుబడికి 50 శాతం అదనంగా లాభం కలిపి మద్దతు ధర నిర్ణయించాలని, 4 శాతం వడ్డీకి రుణాలు ఇవ్వాలని సిఫార్సు చేశాయి. మేమూ ఇవే డిమాండ్లు చేస్తున్నాం. మాది రాజకీయం అవుతుందా? వరి పనలు పొలం మీద ఎండుతున్నప్పుడు వర్షానికి పాడైతే బీమా వర్తించదని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏవిధంగా, ఎప్పటిలోగా పరిహారం చెల్లిస్తారో ప్రభుత్వం చెప్పాలి.

కరవు వచ్చినప్పుడు 30 శాతం రుణాలు కూడా రీషెడ్యూల్ చేయించలే ని ప్రభుత్వం... మరోసారి రీ షెడ్యూల్ అంటూ మభ్యపెడుతోంది. టీడీపీ హయాంలో అమలు చేసిన సంస్కరణలు, ఏర్పాటు చేసిన కొత్త ప్లాంట్లే ఉచిత విద్యుత్తుకు ఆలంబన అయ్యాయి. కానీ, కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సంస్థలను దివాలా తీయించారు. అందుకే... 9 గంటల ఉచిత విద్యుత్ ఒక మిథ్యగా మారింది. ఎన్టీఆర్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం... దేశంలో మొదటిసారిగా రుణాలు రద్దు చేసిందని గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో 30 లక్షల టన్నుల వరకు ధాన్యం తడిసిందని అంచనా.

ప్రస్తుతం 4 నుంచి 10 శాతానికి మాత్రమే సడలించారు. మా హయాంలో 24% సడలింపు ఇచ్చి, మొత్తం ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేశాం. ఇప్పుడు అలా ఎందుకు చెయ్యరు? కొనుగోలు కేంద్రాలు తెరవకుండా, గోదాములు ఖాళీ చేయించకుండా, ఎగుమతులకు అనుమతులు తెప్పించకుండా మొత్తం ధాన్యాన్ని కొంటామంటూ రైతులను దగా చేస్తోంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాలద్వారా పత్తి క్వింటాలుకు రూ.4500 చెల్లించాలన్నా దిక్కులేదు.

చెరుకుకు టన్నుకు రూ.2500 చెల్లించాలని సిఫార్సు చేసిన సమాధానం లేదు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ ఈ చర్యలు తీసుకున్నా... ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకోవడంలేదు? 2007లో చెల్లించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీని ఇప్పుడు ఇచ్చారు. చేనేత, మత్స్య, గీత, ఇతర చేతి వృత్తుల వారికి ఎన్యుమరేషన్ చేయకుండానే పరిహారం పెంచామంటున్నారు. రైతు పుట్టెడు కష్టాల్లో ఉంటే పట్టించుకోకుండా పార్టీ మీటింగులని, పదవులని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు.

గత ఆరున్నరేళ్లలో జలయజ్ఞం, మేఘమథనం, విత్తనాల స్కామ్, మిక్సింగ్ ప్లాంట్ల అక్రమాలు, ఆదర్శ రైతులు బాగోతం, బయో డీజిల్ మొక్కల పెంపకం అన్నింటిలోనూ వేలాది కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ధాన్యం తడిసి, రంగుమారి, మొలకలు వచ్చి ముక్కిపోతుంటే కొనే నాధుడు లేక రైతు మనోనిబ్బరం కోల్పోతున్నాడు. ఈ మొండి ప్రభుత్వం మెడలు వంచే దాకా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు''.
click here

No comments:

Post a Comment