Tuesday, February 1, 2011

సోనియాకు డబ్బు పిచ్చి! వైఎస్ లాంటి అవినీతిపరులను పెంచి పోషించారు మన్మోహ న్ రబ్బర్ స్టాంప్

స్విస్‌బ్యాంక్ వివరాలు బయటకు రావాలి
మాఫియా డాన్‌లా ప్రభుత్వాలు
కిరణ్‌కుమార్‌రెడ్డికి అనుభవం లేదు:చంద్రబాబు 
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి బాగా డబ్బు పిచ్చి పట్టిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ధన వ్యామోహంతోనే సోనియా రాష్ట్రంలో వైఎస్ వంటి వారిని పెంచి పోషించారని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాఫియా డాన్‌లా మారాయని ఆరోపించారు. కర్నూలు జిల్లా మద్దికెర, తుగ్గలి, పత్తికొండ, దేవనకొండ, కోడుమూరు మండలాల్లో మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

కర్నూలు జిల్లాకు వచ్చే ముందు ఆయన గుంతకల్లులో కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకుని.. విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 'వైఎస్ హయాంలో మొదలైన అవినీతితో ఆయన కుమారుడు జగన్మోహనరెడ్డికి రూ.లక్షకోట్లు సమకూరింది. 'సాక్షి' దినపత్రికకు రూ.1,256 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి. ప్యాకేజీలు కుదుర్చుకుని కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న మీడియా మాఫియా కూడా పెరిగిపోతోంది' అన్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్ సోనియాకు రబ్బరు స్టాంపులా మారారని 

విమర్శించారు.

'నల్లధనాన్ని వెలికితీసేందుకు మన్మోహన్, సోనియా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కేవలం విదేశీఖాతాల్లో ఉన్న సొమ్ముతోనే ఇంటికి రూ.2 లక్షల చొప్పున ఇవ్వొచ్చు. స్విస్‌బ్యాంక్ ఖాతాల వివరాలు బయటకు రావాలి. నల్లధనం వెలికితీతపై తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరినీ చైతన్యపరిచి భారతదేశ అభివృద్ధికి పోరాడుతుంది' అని బాబు స్పష్టం చేశారు. సేద్యాన్ని నమ్ముకున్న రైతుల కష్టాలపై తాను దీక్షలు, పర్యటనలు చేస్తున్నానని చెప్పారు.

అన్యాయం జరిగినా నోరు మెదపరేం?

బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో తీరని అన్యాయం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కోర్టుకు ఎ లా అప్పీలు చేయాలన్న దిశగా కూడా ఆలోచించడం లేదని విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అనుభవం లేదన్నారు. 'మన ప్రాజెక్టులకు రావాల్సిన నీటిని ఎగువ రాష్ట్రాలు దోచుకుంటున్నా మన ప్రభుత్వం కనీసం నిలదీయలేకపోతోంది. లేని జలాలను ఉన్నట్టుగా చూపించిన వైఎస్.. జలయజ్ఞం పేరిట రూ.లక్షల కోట్ల మేరకు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో అందజేసి గుడ్‌విల్ దోచుకున్నారు' అని ధ్వజమెత్తారు.

టీడీపీ హయాంలోనే అభివృద్ధి..
ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతాలుగా ముద్రపడిన గుజరాత్, బీహార్ రాష్ట్రాలు నేడు అభివృద్ధి పథంలో దూసుకెళ్తుండగా ఆంధ్రప్రదేశ్ మాత్రం రోజురోజుకూ దిగజారి పోతోందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే జరిగిందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ప్రజలకు, విద్యార్థులకు కష్టాలు, కన్నీళ్లే మిగు లుతున్నాయన్నారు. కాగా పరిటాల రవీంద్రను హత్య చేయించడం వెనుక వైఎస్, ఆయన తనయుడు ఉన్నారని ఆరోపించారు. ఈ కేసులో చివరకు భానుకిరణ్‌ను కూడా చంపేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. మంగలి కృష్ణ వాంగ్మూలం ఆధారంగా ఇప్పటికైనా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

నేను పిలుస్తా.. మీరు రోడ్లెక్కండి!
సమయం వచ్చినపుడు తాను పిలుపునిస్తానని, అప్పుడు సమస్యలపై రైతులు, విద్యార్థులు రోడ్లెక్కాలని బాబు పిలు పునిచ్చారు. సమస్యల పరిష్కారానికి అలా రోడ్లెక్కితేనే ఈ ప్రభుత్వం స్పందిస్తుందన్నారు. అనంతపురం జిల్లా రైతాంగం వరుస కరువులతో విలవిల్లాడుతుంటే ఆదుకునే ఆలోచనే లేదన్నారు. రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయని పీఆర్‌పీ, కాంగ్రెస్ దోస్తీని ప్రస్తావిస్తూ బాబు వ్యాఖ్యానించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రులు కే.ఈ ప్రభాకర్, కేఈ ప్రభాకర్, ఫరూక్, బీవీ మోహనరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, బీకే పార్థసారథి, కందికుంట ప్రసాద్, పల్లె రఘునాథరెడ్డి, అబ్దుల్ ఘని, మీనాక్షినాయుడు, ఎమ్మెల్సీ మసాల పద్మజ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.టి.నాయుడు పాల్గొన్నారు.

No comments:

Post a Comment